పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల సాయం

ఇటీవల అనారోగ్యంతో మరణించిన స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని అధినేత కేసిఆర్ నిర్ణయించారు.ఇందులో భాగంగా, సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరోకోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో, పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున వారి బాగోగుల కోసం మరో 25 లక్షలు రూపాయలను తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేయాలని కెసిఆర్ గారు నిర్ణయించారు.తద్వారా మొత్తంగా, 2 కోట్ల 25 లక్షల రూపాయలను పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నది.ఇంతటితోనే కాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని అధినేత తెలిపారు.ఈ మేరకు పార్టీ సీనియర్లతో పాటు వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మల కార్యక్రమాలు ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని వారి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారనీ,ఎల్లకాలం వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ గారు పునరుద్ఘాటించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించనున్నారు. ఆదివారం నాడు నర్సంపేట నియోజకవర్గం లోని పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లికి బయలుదేరి వెళ్ళనున్నారు.
