కన్నుల పండువగా మిస్ వరల్డ్ 2025 ప్రారంభ ఉత్సవాలు

1 min read
 సంస్కృతి, సౌందర్యం రెండింటి మేళవింపుగా నిర్వహించనున్న  మిస్ వరల్డ్ —2025 ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.
సీఎం  రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు ఈ పోటీల్లో తెలంగాణ సంస్కృతి, కళలు, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చక్కని కార్యక్రమాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.
 తెలంగాణాకు చెందిన వివిధ రకాల జానపద, గిరిజన, శాస్త్రీయ కళలు, హైదరాబాది దక్కని కళారూపాలను ఈ ఉత్సవాలలో సమ్మిళితం చేసి ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతి ని, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రపంచ దేశాల నుంచి హైదరాబాద్ నగరానికి విచ్చేసే సుందరీమణుల ఆహ్వానం కోసం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈనెల 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, కథక్, డప్పులు, బాజాభజంత్రీలు, మంగళ వాయిద్యాల తో కూడిన బృందాలతో స్వాగతం పలికేలా ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటల పాటు అందుబాటులో ఉండి ఈ కళాకారులు ఎయిర్పోర్టులో ప్రపంచ సుందరి పోటీలకు విచ్చేస్తున్న సుందరీమణులకు స్వాగతం పలకడం జరిగింది.  వారందరూ తెలంగాణ నేల మీద, హైదరాబాదులో కాలిడగానే కుంకుమ తిలకం దిద్ది, హారతులతో వారికి స్వాగతం పలకడం జరిగింది.
రేపు ( మే 10వ తారీకున)  గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రపంచ సుందరి ప్రారంభోత్సవ వేడుకలలో తెలంగాణ సంస్కృతి, కళలు ఆకట్టుకునేలా రూపొందించడం జరిగింది. వాటిలో మొదట తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో ప్రారంభం అవుతాయి. లోక కవి డాక్టర్ అందెశ్రీ గారు రచించిన ఈ గీతానికి, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి గారు సంగీతాన్ని సమకూర్చగా, ఈ పాటని ఈ ప్రపంచ సుందరి వేడుకలలో ప్రముఖ గాయకుడు, శిక్షకుడు  కొమాండూరి రామాచారి గారి శిష్య బృందం 50 మంది బృంద గీతంగా ఆలపిస్తారు.
ఆ తర్వాత కాకతీయుల కాలం నుండి తెలంగాణ శాస్త్రీయ నృత్య రీతిగా ఖ్యాతి గడించిన పేరిణి నాట్య ప్రదర్శన అత్యంత వైభవంగా జరగనుంది. 250 మంది మహిళా కళాకారిణులు పేరిణి లాస్య సంప్రదాయాన్ని అనుసరించి ఈ నృత్యాన్ని ప్రదర్శించబోతున్నారు. దీనికి శ్రీ పేరిణి సందీప్ నృత్య దర్శకత్వం వహించగా, ప్రముఖ సంగీత నిపుణుడు ఫణి నారాయణ గారు స్వరాలు సమకూర్చడం జరిగింది. దాదాపు పది నిమిషాల పాటు జరిగే ఈ పేరిణి నాట్యం లో సౌందర్యం, సంస్కృతి, స్త్రీల సాధికారత అంశాలు ప్రధానంగా ఉదహరించడం జరిగింది.  దాంతోపాటు కళాకారులు అందరూ కలిసి నక్షత్రం ఆకారం లో, సీతాకోకచిలుక ఆకారాన్ని, అలాగే మిస్ వరల్డ్ లోగో ఆకృతిని కూడా తమ విన్యాసాల లో భాగంగా ప్రదర్శిస్తారు.
ఆ తర్వాత ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన సుందరీమణుల పరిచయ కార్యక్రమానికి ప్రారంభ సూచికగా, ఖండాల వారీగా తెలంగాణ జానపద, గిరిజన కళారూపాల ప్రదర్శనలతో ప్రారంభమవుతాయి. వాటిలో భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతానికి పట్టుగొమ్మగా నిలిచిన కొమ్ము కోయ కళాకారులు శ్రీ రామకృష్ణ బృందం ప్రదర్శన ఉంటుంది.  ఆ తర్వాత ఆదిలాబాద్ ప్రాంతం నుంచి గోండు జాతి ప్రజల విశిష్ట కళారూపం గుస్సాడీ కళా ప్రదర్శన శ్రీ కత్లే శ్రీధర్ బృందంతో మరొక ఖండానికి సంబంధించిన సుందరీమణులు వేదిక కి పరిచయం అవుతారు. అలాగే తెలంగాణ జానపద సంప్రదాయానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచే డప్పులు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత శ్రీ అందే భాస్కర్ బృందంతో, తెలంగాణ గిరిజన వైభవానికి ప్రతీకగా నిలిచే బంజారా మహిళల విన్యాసాలు శ్రీమతి స్వప్న బృందంతో ప్రదర్శనకి వస్తాయి.
 ఆ తర్వాత తెలంగాణ గ్రామీణ పల్లె జీవన ప్రతీకగా నిలిచిన ఒగ్గుడోలు కళా విన్యాసాలు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత శ్రీ చౌదరపల్లి రవి కుమార్ బృందంచే ప్రదర్శితమవుతోంది.
ఈ కళారూపాలు అన్నింటి మేళవింపుగా ముగింపు ఉంటుంది.
ఇలా సౌందర్యం, సంస్కృతి రెండు కలగలిసిన వేడుకగా ఈ ప్రారంభోత్సవ సంబరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn