నన్ను కోసినా మీ డిమాండ్లు తీరవు.. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
1 min read
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీ ఉచ్చులో పడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తనను కోసినా కూడా ఉద్యోగస్తుల డిమాండ్లు నేరవేరవని ఆయన తేల్చి చెప్పారు. ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. మీ సమరం తెలంగాణ ప్రజలపైనా అని ఆయన ప్రశ్నించారు. ప్రతీ నెలా ఏడు వేల కోట్లు ప్రతీ నెలా కట్టాల్సిన పరిస్థితి ఉందని, గత పాలకులు 8500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారని సీఎం స్పస్టం చేశారు. కేవలం పదహారు నెలల్లో మేం 30 వేల కోట్ల నగదు రైతుల ఖాతాలకు బదిలీ చేశామన్నారు. ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లారని ఆయన ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు కట్టామని చెప్పి .. కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారన్న ఆయన ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదు,మనమంతా కలిస్తేనే ప్రభుత్వం అని ఆయన అన్నారు. ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులకు ఉందన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా అని సీఎం ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్న,ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుందామని ఆయన సూచించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దని ముఖ్యమంత్రి అన్నారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కడా అప్పు పుట్టడంలేదన్న ఆయన స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారం అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం.. కుటుంబ పరువును బజారున పడేయొద్దని ఆయన ఉద్యోగ సంఘాల నాయకులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నది , నన్ను కోసినా ఏం చేయలేనన్నారు.