గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. అజారుద్దీన్ కోసమేనా..?

లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ అయ్యారు.
విద్యారంగానికి సంబంధించి వివిధ అంశాలపై వీరిద్దరు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని గవర్నర్ శుక్లా ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలుస్తోంది. విద్యార్థులతో ప్రమాణం చేయించేలా చర్యలు తీసుకోవాలని,పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనే మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకోవాలని గవర్నర్ స్పష్టం చేసినట్లు సమాచారం. జూన్ 12 న ఎల్బీస్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.గవర్నర్ సూచనలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం.
మరో వైపు మంత్రి అజారుద్దీన్ పదవి కాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ చర్చనీయాంశం అయింది. గవర్నర్ కోటా శాసనమండలి సభ్యుడిగా అజారుద్దీన్ పేరు ను రాష్ట్ర మంత్రి వర్గం సిఫారసు చేసింది. అయితే ఈ అంశంపైన సుప్రీంకోర్టులో కేసు ఉండటంతో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టారు. కాని ఇటీవల గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చునని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ను కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సారి ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ జనరల్ గవర్నర్ ను కలిసి న్యాయపరమైన అంశాలపైన చర్చించారు.
అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవిపైన గవర్నర్ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోకపోతే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆరునెలలు పూర్తయ్యే సరికి అసెంబ్లీ లేదా శానసమండలి లో సభ్యుడి గా ఎన్నిక కావాల్సి ఉంటుంది.
