బీఆర్ఎస్ కు పది సీట్లు కూడా రావు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా అనే పదాన్ని హిట్లర్ నుంచి తీసుకున్నానని చెప్పడంలో తప్పేముందని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. చెరువులను కబ్జాదారుల నుంచి కాపాడాలంటే ఉక్కు సంకల్పం కావాలని, అందుకే హిట్లర్ గురించి సీఎం మాట్లాడరన్నారు. ఆయన వ్యాఖ్యలను నాజీ తో పోల్చడం సరైనది కాదన్నారు. గతంలో కేసీఆర్ కూడా తాను హిట్లర్ లా వ్యవహారిస్తానని వ్యాఖ్యానించిన విషయాన్ని కేటీఆర్ మరిచిపోవద్దన్నారు.కేసీఆర్, కేటీఆర్ ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడటం అంటే గురువింద గింజ తన కింద నలుపు ఎరుగనట్లే ఉంటుందన్నారు. అంబేద్కర్ గురించి మాట్లాడం అంటే శతాబ్దపు జోకనన్నారు.నాజీలు పెట్టిన హిట్లర్ బంకర్ లా ప్రగతి భవన్ ఉండేదన్నారు. ఇనుప కంచెలను తమ ప్రభుత్వం వచ్చాక తొలగించామని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం ప్రజాస్వామ్యమా అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ సమానత్వం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ధ్వజమెత్తారు. దొంగతనాలు, కబ్జాలు జరుగుతుంటే చేతులు కట్టుకుని కూర్చోమని మహాత్మగాంధీ చెప్పలేదన్నారు. హైడ్రా చట్టపరిధిలో పనిచేస్తోందన్న శ్రీధర్ బాబు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే హైడ్రా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకుంటోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ డీఎన్ ఏ లో హింస లేదన్న ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని సహించమన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు తొంభై సీట్లు వస్తాయని హరీష్ రావు చెప్పుకుంటున్నాడు కాని బీఆర్ఎస్ కు పది సీట్లు కూడా రావని తేల్చి చెప్పారు.
