సీఎం రేవంత్ రెడ్డితో అనలాగ్ సీఈఓ అలెక్స్ కిప్‌మాన్ భేటీ

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మాన్, మెగా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ ఎండీ పి. కృష్ణారెడ్డి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు కె. రామకృష్ణారావు, ఇన్వెస్ట్ సీఈఓ, హైదరాబాద్ మెట్రోరైల్ అదనపు ఎండీ బి. అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

అనలాగ్, మెగా సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఈ సందర్భంగా చర్చిచారు.

అనలాగ్, మెగా సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో భవిష్యత్తరాలకు అవసరమైన మేధోపరమైన మౌలిక సదుపాయాలు (Next Generation Intelligent Infrastructure), ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలపై తమ ఆలోచనలను సమావేశంలో వివరించారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. నగరంలో ఎదురయ్యే సమస్యలకు సత్వర పరిష్కారానికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై వారు సమావేశంలో వివరించారు.

నగరంలో అత్యాధునిక ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్స్ (Advanced Physical Intelligence Platforms) వినియోగం వల్ల ప్రయోజనాలను తెలిపారు.

సెన్సర్లు, రోబోటిక్స్ వంటి ఫిజికల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా సురక్షితమైన, సమర్థవంతమైన, వేగంగా స్పందించే పట్టణ రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఎలా తోడ్పుతుందన్న అంశాలను వివరించారు.

ట్రాఫిక్ రద్దీని గుర్తించి తదనుగుణంగా సిగ్నళ్ల వ్యవస్థ, నీటి లీకేజీలను ముందుగానే గుర్తించి మరమ్మతులు చేపట్టడం, అవసరానికి అనుగుణంగా విద్యుత్ వినియోగాన్ని నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకు మార్గం సుగమం చేయడం వంటి కాగ్నిటివ్ సిటీస్ (Cognitive Cities) రూపకల్పనకు ఉన్న విస్తృత అవకాశాలను సమావేశంలో సమావేశంలో వివరించారు.

వేగంగా పెరుగుతున్న పట్టణాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, ప్రభుత్వాల కార్యనిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, పౌరులకు అందించే సేవలను మరింత మెరుగుపరచడం, అలాగే డేటా ఆధారిత మౌలిక సదుపాయాల ప్రణాళికకు ఎలా దోహదపడతాయో ఇరు సంస్థలు వివరించాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇటు సంస్థలకు పలు సూచనలు చేశారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఇంటిగ్రేట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పనిచేసే విధానాన్ని తీసుకురావాలన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేలా AI కి అనుసంధానించాలని సీఎం సూచించారు.

సమావేశం అనంతరం ముఖ్యమంత్రి గారి సమక్షంలో అనలాగ్, ఎంఈఐఎల్ సంయుక్త భాగస్వామ్యంతో అవగాహన ఒప్పందం కుదిరింది. పరస్పరం సాంకేతిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం, ఆవిష్కరణల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ఒప్పందం కీలకంగా మారుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn