మేడిగడ్డ మరమ్మతులకు రంగం సిద్ధం…

నిపుణుల నివేదికల ఆధారంగా పునరుద్ధరణ పనులు… భద్రతా అనుమతుల తర్వాతే బ్యారేజీల నిర్వహణ
శాస్త్రీయ విధానంతో కాళేశ్వరం బ్యారేజీల పునరుజ్జీవనానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, జూలై 20: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బ్యారేజీలపై నిర్వహిస్తున్న సమగ్ర శాస్త్రీయ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయని, వాటి ఆధారంగా మరమ్మతులు, పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బ్యారేజీల పునరుద్ధరణలో ప్రభుత్వం పూర్తిగా శాస్త్రీయ విధానాన్నే అనుసరిస్తోందని స్పష్టం చేశారు.
నిపుణులు భద్రతపై పూర్తి స్థాయిలో ధ్రువీకరించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తిరిగి నిర్వహణలోకి తీసుకురాబోమని వెల్లడించారు.
సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS), నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) వంటి దేశంలోని అత్యున్నత సాంకేతిక సంస్థలు నేల స్వభావం, పునాదులు, కాంక్రీట్ నిర్మాణం, ఇతర నిర్మాణ భాగాలపై విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించాయని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం ఆ పరీక్షలు దాదాపు పూర్తయ్యాయని, వాటి ఫలితాలను ఐఐటీ బొంబాయికి పంపించగా, అక్కడ నిపుణులు సమగ్ర పునరుద్ధరణ డిజైన్లను సిద్ధం చేస్తున్నారని చెప్పారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం డయాఫ్రం వాల్ నిర్మాణం పునరుద్ధరణలో భాగం కావచ్చని భావిస్తున్నప్పటికీ, అన్ని సాంకేతిక నివేదికలను పరిశీలించిన అనంతరమే తుది మరమ్మతుల విధానాన్ని నిర్ణయిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ, జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ (NDSA), కేంద్ర జల సంఘం (CWC) సూచనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు.
పునరుద్ధరణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు భారత సైన్యంలో సేవలందించిన అనుభవజ్ఞులైన ఇంజినీర్ల సేవలను ప్రభుత్వం వినియోగిస్తోందని, కల్నల్ పరిక్షిత్ మెహ్రా నేతృత్వంలోని సమన్వయ కమిటీ పరీక్షలు, సాంకేతిక ప్రణాళికలను పర్యవేక్షిస్తూ పారదర్శకత, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు.
ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని పునరుద్ఘాటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాస్త్రీయ పరీక్షలు, నిపుణుల రూపకల్పన, చట్టబద్ధ భద్రతా అనుమతులు పూర్తయిన తర్వాతే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
ప్రజాధనంతో నిర్మించిన ఈ కీలక ప్రాజెక్టును శాశ్వత భద్రతతో పునరుద్ధరించి రాష్ట్ర అవసరాలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
