అడ్లూరి నాకు అన్న లాంటివాడు.. పొన్నం విచారం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పైన చేసిన వ్యాఖ్యలపైన మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు.అడ్లూరి తనకు అన్నలాంటి వాడని స్పష్టం చేశారు. తన పైన పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటు అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం కల్గచేసుకుంది.
మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేసిన ప్రకటన ..
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు నాకు సోదరులవంటివారు. కాంగ్రెస్ పార్టీలో మాకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదే. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగింది. ఎవరు విడదీయరానిది.
నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, నాకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదు. అయితే, రాజకీయ దురుద్దేశంతో కొంతమంది నా వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటివారు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మనసు నొచ్చుకుందని తెలిసి నేను తీవ్రంగా విచారిస్తున్నాను.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో,రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో, ప్రజల అభ్యున్నతికై మేము ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తాం.