హైదరాబాద్లో భారీ ఐటీ పార్క్
1 min read
రూ. 450 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం
10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి
క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో సీఎం చర్చలు
సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో ముందడుగు వేసింది.
రాష్ట్రంలో రూ.450 కోట్ల పెట్టుబడులకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్ లో అత్యాధునిక ఐటీ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
సింగపూర్ కేంద్రంగా విస్తరించిన ఈ కంపెనీ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటి. హైదరాబాద్ లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్ను అభివృద్ధి చేయనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సింగపూర్ లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో క్యాపిటల్ ల్యాండ్ ఈ నిర్ణయం ప్రకటించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంవో స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, క్యాపిటల్ ల్యాండ్ తరఫున ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ తదితరులు పాల్గొన్నారు.
క్యాపిటల్ ల్యాండ్ చేపట్టే కొత్త ఐటీ పార్కు హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలు రాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.. క్యాపిటల్ ల్యాండ్ నిర్ణయాన్నిస్వాగతించారు. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల కు పెరుగుతున్న డిమాండ్ను అందుకునేలా అన్ని సౌకర్యాలను ఈ ఐటీ పార్కులో అందుబాటులో ఉంటాయి.
ఈ సందర్భంగా గౌరీ శంకర్ నాగభూషణం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించటం ఆనందంగా ఉందని అన్నారు.
క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్ లో అంతర్జాతీయ టెక్ పార్క్ (ITPH), అవాన్స్ హైదరాబాద్, సైబర్పెర్ల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలోనే అందుబాటులోకి వస్తుంది. ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది.