సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి

1 min read

సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ

నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం

ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు తొలిరోజునే విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ టీమ్ శుక్రవారం సింగపూర్ లో పర్యటించింది.

సీఎం రేవంత్ రెడ్డి వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్ వీ ఎస్ఎస్ సుబ్బారావు ఈ టీమ్లో ఉన్నారు.

తొలి రోజునే తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) క్యాంపస్ ను సందర్శించింది. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవెలప్ మెంట్ కోర్సులు, అధునాతన సదుపాయాలను పరిశీలించింది. అక్కడ శిక్షణను అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడారు.

అనంతరం ఐటీఈ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. హైదరాబాదులోని ఫోర్ల్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరును ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

నైపుణ్యాల అభివృద్ధి (స్కిల్ డెవెలప్మెంట్) శిక్షణలో భాగస్వామ్యం కోసం పరస్పర సహకారం అందించాలని కోరారు. ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పని చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది.

చర్చల అనంతరం నైపుణ్యాల అభివృద్ధిలో కలిసి పని చేసేందుకు ఐటీఈ, స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ ఒప్పందంపై యూనివర్సిటీ వీసీ సుబ్బారావు, సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం తరఫున అకడిమిక్ అండ్ అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్ సింగ్, ఐటీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ సంతకాలు చేశారు.

త్వరలోనే ఐటీఈ ప్రతినిధి బృందం హైదరాబాద్ ను సందర్శించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn