ఏడాదిలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యం

దేవాదుల ప్రాజెక్టును ఏడాదిలోగా వందశాతం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారి అధ్యక్షతన మంగళవారం నాడు జలసోద లో దేవాదుల ప్రాజెక్టు పై జరిగిన సమీక్షలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ
ప్రాజెక్టు పనులను ప్రారంభం నుంచి ముగింపు వరకు సమగ్రంగా సమీక్షించి, ఎక్కడ పనులు నిలిచిపోయాయి, అందుకు కారణాలేంటి.. వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాలను పాయింట్వారీగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
సమస్య ను గుర్తించకుండా పనులు పూర్తవుతాయి అంటూ కాలయాపన చేయడం సరికాదని, ప్రతి సమస్యకు స్పష్టమైన పరిష్కారం, బాధ్యత, గడువు నిర్ణయించాలని అధికారులకు సూచించారు.
భూసేకరణ, అనుమతులు, నిర్మాణ పనులు, నిధులు, కాంట్రాక్టు ఏజెన్సీలకు సంబంధించిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం, అధికారులు, ఇంజినీర్లు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉన్న అధికారులతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సమగ్ర సమీక్ష నిర్వహించి, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
సమస్య ఎక్కడ ఉందో ముందుగా గుర్తించాలి.. కారణాన్ని విశ్లేషించాలి.. పరిష్కారాన్ని ఖరారు చేసి అమలు చేయాలి. ఫలితం వచ్చే వరకు నిరంతరం పర్యవేక్షించాలి. దేవాదుల పూర్తి విషయంలో ఎలాంటి కాలయాపనకు తావులేదుఅని మంత్రి స్పష్టం చేశారు
