గ‌రిష్ట స్థాయిలో గోదావ‌రి జ‌లాల వినియోగం..ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

గ‌రిష్ట స్థాయిలో గోదావ‌రి జ‌లాల వినియోగం

* సుందిళ్ల‌, అన్నారం, మేడిగ‌డ్డ ప్రాజెక్టుల్లో ఎన్డీఎస్ఏ సూచ‌న‌లు పాటించాలి…
* ప‌రిహారం.. పున‌రావాసం చెల్లింపులు వేగ‌వంతం చేయండి..
* గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుపై క‌న్స‌ల్టెన్సీని నియ‌మించండి..
* నీటి పారుద‌ల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: గోదావ‌రి జలాల‌ను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎల్లంప‌ల్లితో పాటు దేవాదుల‌, సీతారామ ప్రాజెక్టుల‌ నుంచి సాధ్య‌మైనంత మేర‌కు ఎత్తిపోత‌లు చేప‌ట్టాల‌న్నారు. రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డితో క‌లిసి నీటి పారుద‌ల శాఖ‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచ‌న‌ల మేర‌కే సుందిళ్ల‌, అన్నారం, మేడిగ‌డ్డ బ్యారేజీల్లో నీరు నిల్వ చేయ‌డం లేద‌ని, ఈ విష‌యంలో ఎన్డీఎస్ఏ సూచ‌న‌లు పాటించాల‌న్నారు. మేడిగ‌డ్డ‌తో పాటు సుందిళ్ల బ్యారేజీలోనూ అనేక లోపాలు ఉన్న‌ట్లు తేలింద‌ని మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ విష‌యంలో ఎన్డీఎస్ఏతో సంప్ర‌దించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

దేవాదుల నుంచి గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా 9 పంపుల‌తో ఎత్తిపోత‌లు చేప‌ట్టామ‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేవాదుల‌, సీతారామ‌ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోత‌ల‌కు సంబంధించి ఏవైనా చిన్న చిన్న స‌మ‌స్య‌లుంటే అధికారులు వాటి ప‌రిష్కారంపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని సీఎం సూచించారు. ప‌లు ప్రాజెక్టుల కింద ఒక‌ట్రెండు గ్రామాలు, కొద్ది పాటి వ్య‌వ‌సాయ భూముల‌కు ప‌రిహారం చెల్లింపు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, వాటిని వెంట‌నే చెల్లించేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని సీఎం ఆదేశించారు. నీటి పారుద‌ల‌, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి ముంపు గ్రామాలు, ప‌రిహారం, పున‌రావాసానికి సంబంధించి వాస్త‌వ నివేదిక రూపొందించాల‌ని సీఎం ఆదేశించారు. త‌క్ష‌ణ ప్ర‌భావం పడే గ్రామాలకు వెంట‌నే ప‌రిహారం చెల్లించాల‌ని సీఎం సూచించారు. అధికారులు ఆ ప‌నుల‌ను పూర్తి చేస్తే బ‌స్వాపూర్‌, గౌర‌వెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపే అవ‌కాశం ఉంటుంద‌ని సీఎం తెలిపారు.

గ‌ట్టు, గూడెందొడ్డి ఎత్తిపోత‌ల సామ‌ర్థ్యం పెంపున‌కు సంబంధించి స‌మ‌గ్ర అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. గూడెందొడ్డి పంప్డ్‌స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి క‌న్స‌ల్టెంట్ నియ‌మించాల‌ని సీఎం ఆదేశించారు. స‌మీక్ష‌లో సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ వి.శేషాద్రి, సీఎం సెక్ర‌ట‌రీ మాణిక్ రాజ్‌, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ కార్య‌ద‌ర్శి ఈ.శ్రీ‌ధ‌ర్‌, ఆర్ అండ్ ఆర్ క‌మిష‌న‌ర్ శివ కుమార్ నాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn