కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి..నిజమేనా..?

సాధారణ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలపైన చర్చ మొదలైంది. పార్టీ ఫిరాయింపులు, టిక్కెట్ల పైన నేతలు ద్రుష్టి సారించారు. ఈ క్రమంలోనే నల్గొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు ప్రచారం ప్రారంభమైంది. ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భూపాల్ రెడ్డి రహస్యంగా భేటీ అయినట్లు చెపుతున్నారు. అయితే దీనిపైన ఇటు కాంగ్రెస్ పార్టీ కాని, అటు భూపాల్ రెడ్డి కాని స్పందించలేదు.

నల్గొండలో భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ నేతల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్న నాయకులతో పాటు మరికొందరు నల్గొండ సీటుపైన కన్నేశారు. వీరంతా భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. చాడా కిషన్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్ తో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు కూడా టిక్కెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరంతా నియోజకవర్గంలో తిరుగుతు కేడర్ ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.

అసమ్మతి ఉన్నప్పటికి బీఆర్ఎస్ లో కంచర్ల భూపాల్ రెడ్డికి పెద్ద ఇబ్బందులేవీ లేవనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో ఆయనకే మళ్లీ నల్గొండ టిక్కెట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బలంగా ఢీ కొట్టగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు భూపాల్ రెడ్డి. ఆయనను వదులుకునేందుకు బీఆర్ఎస్ ఎంత మాత్రం సిద్దం లేదు. ఆయన కూడా ఆ పార్టీని వదిలిపెట్టే అవకాశం ఎంత మాత్రం లేదు. రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పుడు భూపాల్ రెడ్డి సన్నిహితుడు. కాని ఇద్దరు పార్టీ మారిన తర్వాత పెద్దగా సంబంధాలు లేవు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కోసం భూపాల్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారంలో పస కనిపించడం లేదు. నల్గొండ రాజకీయ సమీకరణాల ఆధారంగా చూస్తే భూపాల్ రెడ్డి పార్టీ మారే అవకాశం వంద శాతం లేదనే చెప్పాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn