ధాన్యం దిగుబడిలో తెలంగాణా రికార్డ్

1 min read

నిరుపేదలందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు.స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సారిగా పేదలకు సన్నబియ్యం అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణాకు దక్కిందని ఆయన పేర్కొన్నారు.కేంద్రం సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు.కేంద్రం సరఫరా చేసేది ఇప్పటికీ దొడ్డు బియ్యమే నని అదీ కుడా కొందరికే పరిమితమని ఆయన స్పష్టం చేశారు.

దొడ్డు బియ్యం స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని 20 శాతం అదనంగా వెచ్చించి అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన లోకసభ ,శాసనసభ,శాసన మండలి,కార్పొరేషన్ చైర్మన్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.  స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే సన్న బియ్యానికి మించిన సంక్షేమ కార్యక్రమం మరోటి ఉండబోదన్నారు.

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. సన్న బియ్యం బ్ధిదారులతో కలసి భోజనం చేయాలని తద్వారా పేదల పట్ల కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రత్యేక దృష్టిని ప్రజలు గుర్తిస్తారన్నారు.ప్రతి లబ్దిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున అందిస్తున్న సన్నబియ్యం పై రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 13,000 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.ప్రతి సంవత్సరం మూడు కోట్ల 10 లక్షల మందికి , 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేయలని నిర్ణయించామన్నారు.

సన్నబియ్యం సరఫరాకు ముందు కేంద్రం, రాష్ట్రము కలిపి 10,665 కోట్లు ఖర్చు చేసి పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ వివరించారు. సన్న బియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా 2,858 కోట్లు భారం పడుతుందన్నారు. సన్న బియ్యం పంపిణీలో కేంద్రం పాత్ర ఉందంటూ విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు

రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.లబ్ధిదారుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని త్వరితగతిన పరిశీలన జరిపి తెల్ల రేషన్ కార్డులు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణా ఆవిర్భావ సమయంలో 89.73 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో ఆ ప్రభుత్వం మంజూరు చేసింది కేవలం 49,479 తెల్ల కార్డులే నని ఆయన ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారుల నుండి 30 లక్షల దరఖాస్తులు స్వీకరించామన్నారు.లబ్దిదారుల సంఖ్య 2 కోట్ల 81 లక్షల నుండి 3 కోట్ల 10 లక్షలకు పెరగవచ్చని ఆయన తెలిపారు.

 

బి.ఆర్.ఎస్ పాలనలో కట్టిన కాళేశ్వరం కూలి పోయినా మెడిగడ్డ పని చేయక పోయిన రాష్ట్రంలో ఖరీఫ్ ,రబీ సీజన్ లో కలిపి 123.27 లక్షల ఎకరాలలో 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని మంత్రి తెలిపారు. ఖరీఫ్ లో 66.78 లక్షల ఎకరాలలో 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయితే రబీ లో సాగు చేసిన 56.49 లక్షల ఎకరాలలో 127.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేస్తున్నామని ఆయన వివరించారు.ఇంత దిగుబడి తెలంగాణా చరిత్రలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని సంచలనాత్మమని ఆయన చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 4.41 లక్షల మంది రైతుల నుండి 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 1,199 కోట్లు బోనస్ రూపంలో చెల్లించామన్నారు.ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 12,511 కోట్లు రైతులకు చెల్లించడంతో పాటు అదనంగా బోనస్ రూపంలో 1,199 చెల్లించినట్లు ఆయన తెలిపారు.రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు గాను 8,209 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn