గవర్నర్ ను కలిసిన పీసీసీ రేవంత్ రెడ్డి టీం
1 min read
ధాన్యం కొనుగోళ్లతో పాటు పలు అంశాలపైన తెలంగాణ ప్రభుత్వంపైన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతలు క్షీణించడంతో పాటు డ్రగ్స్ విక్రయాలు పెరిగాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్ ను కోరారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎంపిలు,ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు గవర్నర్ తమిళ సై ని కలిశారు.
గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందర రాజన్ కు టీపీసీసీ బృందం సమర్పించిన వినతి పత్రంలోని ముఖ్య అంశాలు
………………………………………………………………………….
⦁ రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారు. అందుకే ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాలయాపన చేశారు. ఫలితంగా చాలా మంది రైతులు రైస్ మిల్లర్లకు, మధ్య దళారీలకు ఇప్పటికే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకున్నారు. మద్ధతు ధర రాక రైతులు రూ.3000 – 4000 కోట్ల మేర నష్టపోయారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి. ఆ రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వం చెప్పిందని ప్రత్యామ్నాయ పంటలు వేసుకున్న రైతుల పంటలను మద్ధతు ధరతో కొనుగోలు చేయాలి.
⦁ రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో 8.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్క తప్పిందని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రైస్ మిల్లర్ల నుండి ఎఫ్సీఐకి చేరాల్సిన ఈ బియ్యం ఎలా మాయమైంది? దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి.
⦁ కోవిడ్ కారణంగా ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి ఉన్న ప్రజలపై కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో భారం మోపుతుంటే… ఇటు రాష్ట్రం నేనేం తక్కువ తిన్నానా అన్నట్టు కరెంట్ ఛార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలు బతకలేని పరిస్థితి కల్పించింది. ప్రభుత్వం తప్పుడు విధానాలతో డిస్కమ్ లు నష్టాల్లో కూరుకుపోయాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదు. ప్రైవేటు బడాబాబుల నుండి రూ.4800 కోట్ల పై చిలుకు బిల్లులు వసూలు చేసుకోలేక ఆ భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయం. తక్షణం ప్రజలపై భారాలు తగ్గించేలా చొరవ తీసుకోవాలి.
⦁ రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2017 లో ఈ కేసును పబ్లిసిటీ కోసం వాడుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తర్వాత ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. పబ్ లు, బార్లకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చారు. హైదరాబాద్ లో చాలా పబ్ లు డ్రగ్స్ హబ్ లు గా మారాయి. దీనిపై సమగ్ర సమీక్ష నిర్వహించి, చర్యలు తీసుకోండి.
⦁ బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దుర్మార్గంగా వాటిని 90 వేలకు కుదించి చూపుతున్నారు. ఈ ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తున్నామని అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా అతీగతీ లేదు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3016 భుృతికి దిక్కులేదు. ఉద్యోగ ఖాళీలు పై సమీక్ష జరిపి, నిరుద్యోగ భుృతి కూడా ఇప్పించేలా చొరవ తీసుకోండి.
⦁ ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. ఐతే, ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు యూనివర్సిటీలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ విధానాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు, ఖాళీల భర్తీ పై తక్షణం చర్యలు తీసుకోండి.
⦁ యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం యూనివర్సిటీల అధ్యాపకుల రిటైర్మెంట్ వయస్సును 60 నుండి 65 కు పెంచాలి. కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానంగా 63 ఏళ్లకైనా పెంచాలి. ఆ దిశగా చర్యలు తీసుకోండి.
⦁ జీవో 111 ఎత్తివేత సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ వేస్తున్నట్టు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చెప్పారు. ఆ కమిటీ నివేదిక రాకుండానే జీవో ఎత్తేస్తున్నట్టు నిన్న కేబినెట్ లో నిర్ణయం చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. దీని వెనుక భారీ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది. గడచిన ఐదేళ్లలో ఈ ప్రాంతంలో సుమారు 10 లక్షల ఎకరాల భూమిని పేద, మధ్య తరగతి రైతుల నుండి టీఆర్ఎస్ నేతలు కొనుగోలు చేశారు. వారికి లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. దీనిపై సీబీఐ విచారణ జరపాలి.