గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయండి..

గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని ఆయన స్పష్టం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి సూచించారు. గోదావరి పుష్కరాలపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అవసరమైన ఏర్పాట్లను పరిశీలించాలని అధికారులకు సూచించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల సమీపంలో ఉన్న గోదావరి పరివాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఘాట్స్ ను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పుష్కరాల సమయంలో దాదాపు 2 లక్షల మంది ఒకేసారి ఘాట్స్ వద్ద స్నానమాచరించేందుకు వీలుగా ఏర్పాట్లు ఉండాలన్నారు.