ఒకే రోజు నాలుగు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
1 min read
ఆదివారం రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు నాలుగు పథకాలు లాంచనంగా ప్రారంభించబోతున్నాం
లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున రేపటి నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది
ఈ నాలుగు పథకాలు రేపు ప్రతి మండలంలో ఒక గ్రామంలో నూరు శాతం అమలు చేస్తాం
వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా
భూమిలేని నిరుపేద, ఉపాధి హామీ పథకంలో 20 రోజులపాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
——————-
నాలుగు సంక్షేమ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఈ పథకాలను రేపు జనవరి 26న లాంచనంగా ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకొని అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. లక్షలాది సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి జనవరి 26న అత్యంత పరమ పవిత్రమైన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ సంక్షేమ పథకాల అమలును ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట మేరకు పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని నూరు శాతం ఆ గ్రామంలో ఈ నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. లక్షలాదిగా వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్లలో ఎంట్రీ చేసి అర్హులను గుర్తిస్తామని, మార్చి మాసం వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా, భూమిలేని నిరుపేద, 20 రోజులపాటు ఉపాధి హామీ పనికి వెళ్లిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి ఉదాత్త ఉన్నతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం సంక్షేమ రాజ్యం అని తెలిపారు.