మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు..సీఎం రేవంత్ రెడ్డి

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
మహిళలకు రిజర్వేషన్లు తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు రాజీవ్ గాంధీ అమలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మహిళా బిల్లును సోనియాగాంధీ గతంలోనే పార్లమెంటులో పెట్టారన్నారు.33 శాతం మహిళా రిజర్వేషన్లలో OBC కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ తో ఎందుకు లింకు పెడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతమున్న 543 సీట్లలో కూడా మహిళా రిజర్వేషన్ అమలు చేయొచ్చునన్న ఆయన ఉత్తర- దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం పెంచాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. ఆర్థిక అంతరాలతో ఇప్పుడు రాజకీయ అంతరం తీసుకువస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఉత్తర, దక్షిణాది మధ్య నియోజకవర్గాల్లో అంతరం ఉందన్న ఆయన కొత్త అంతరం ప్రస్తుత మోతాదులోనే ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. NDA చెప్తున్న లెక్కలు ఉత్తర- దక్షణాది మధ్య పెద్ద అంతరం పెంచనున్నాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 5 రాష్ట్రాలతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది బీజేపీ ఆలోచన ఆయన విమర్శించారు. దక్షిణాదిలో ఎంత పోరాడినా,బీజేపీ గెలవడం లేదన్నారు. ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం, కష్టం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తన అజెండాను ఇప్పటివరకు అధికారికంగా ఇవ్వలేదన్న ఆయన డీలిమిటేషన్ పై ఇండి కూటమి పార్టీలతో చర్చించాలని CWC నిర్ణయించిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
